Corona agitation in public schools
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం
- ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్
- పటమటలంక బాలుర హైస్కూల్లో కలవరం
- పాఠశాలకు సెలవు ప్రకటించిన అధికారులు
మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా కరోనా పట్ల అజాగ్రత్తగా ఉంటూ నిబంధనలను పాటించకపోవడంతో మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా పటమటలంకలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. విషయం తెలుసుకున్న సహచరులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు గురువారం ఉదయం నుంచి ఐదు రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. పటమట పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతోంది.
తరగతి గదులను శానిటైజ్ చేస్తున్నాం
విజయవాడ అర్బన్ డీఈవో చంద్రకళ
కరోనా పాజిటివ్ వచ్చిన ఉపాధ్యాయురాలు ముందురోజు సెలవులో ఉన్నారు. పాఠశాలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించాం. తరగతిలో నిత్యం శానిటైజ్ చేస్తున్నాం, పాఠశాలకు వచ్చే విద్యార్థులకు థర్మల్ స్ర్కీనింగ్ ద్వారా పరిశీలించి తరగతి గదిలోకి పంపుతున్నాం, ప్రభుత్వ పాఠశాలలో పాటిజివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పటమట పరిధిలో తొలిసారి పాజిటివ్ కేసు వచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందనవసరం లేదు. నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
విద్యార్థినికి కరోనా.. పాఠశాలకు సెలవు
గాంధీజీ నగర పాలక సంస్థ పాఠశాలలో ఓ విద్యార్థినికి కరోనా రావటంతో పాఠశాల హెచ్ఎం పైస్థాయి అధికారులకు తెలియపరిచి పాఠశాలకు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. కొత్తపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఓ విద్యార్థికి రెండు రోజుల క్రితం జ్వరం, జలుబు, దగ్గు రావడం అతనికి కొవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తెలిసింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందారు. పాఠశాల కమిటీ స్కూల్కు వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. కాగా ఈ స్కూల్లోని సుమారు ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. భవానీపురం గాంధీబొమ్మ రోడ్డులోని ప్రైవేటు స్కూల్లో సుమారు ఐదుగురుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. దీంతో స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
0 Response to "Corona agitation in public schools"
Post a Comment