Allowance .. Drought!
భత్యం.. కరువు!
- 120 నెలల డీఏ పెండింగ్
- 7 దఫాలు.. మూడున్నర ఏళ్లు
- ధరల భారంతో ఉద్యోగులు ఇబ్బందులు
- కొత్త డీఏ ఊసేలేదు.. డీఆర్ కోసం పెన్షనర్లు
- ఆర్థిక సుడిగుండంలో రాష్ట్ర ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులకు మూడున్నరేళ్లుగా కరవు భత్యం(డీఏ) అందడం లేదు. 2018 జనవరి నుంచి ఇప్పటి వరకు 120 నెలలపాటు ఏడు దఫాలుగా విడుదల చేయాలి. దీనిపై ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. అడగని వారికి కూడా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ప్రభుత్వానికి తమ సంక్షేమం కనిపించడం లేదని వాపోతున్నారు. కరోనా వేళ అనేకమంది చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు డీఏ, పెన్షన్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే సగటున ఒక్కో ఉద్యోగి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేలు నష్టపోతున్నాడు. ఈ మూడున్నరేళ్లలో డీఏ బకాయిలు ఒక్కో ఉద్యోగికి చెల్లించాల్సిన మొత్తం రూ.1,53,244 ఉంటుందని అంచనా. జిల్లాలో అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు 39 వేల 400, పెన్షనర్లు 30 వేల 525 ఉన్నారు. తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, హక్కుగా దక్కే డీఏ మంజూరులో మీనమేషాలు లెక్కించడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఒక వాయిదానే చెల్లింపు
2018 జూలై నుంచి 2020 డిసెంబర్ వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన 30 నెలల బకాయిలను మూడు సమాన వాయిదాలలో చెల్లించనున్నట్టు 2021 జనవరిలో జీవో ఇచ్చింది. దీని ప్రకారం 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సమాన వాయిదాలలో బకాయిలు చెల్లించాలి. కానీ ఒక వాయిదా మాత్రమే చెల్లించి మిగతా వాటి ఊసే లేకుండా చేసింది. విచిత్రం ఏమిటంటే మొత్తం 30 నెలల బకాయిలు చెల్లించినట్టు భావించి ముందుగానే సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఇన్కంటాక్స్ మినహాయించారు. ఇది ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారే లేరు.
ఇలా నిర్ణయిస్తారు
కేంద్ర గణాంక శాఖ లెక్కల ప్రకారం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల సూచి (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) ఆధారంగా కేంద్రం తమ ఉద్యోగులకు కరువు భత్యం మంజూరు చేస్తుంది. 12 నెలల ధరల సూచి ఆధారంగా కరువు భత్యం నిర్ణయిస్తారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర విధానాన్నే తమ ఉద్యోగుల విషయంలో వర్తింపజేస్తున్నాయి. రాష్ట్రంలో 1958లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య జరిగిన ఒప్పంద ప్రకారం కరువు భత్యం మంజూరు, పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేశారు.
శోచనీయం.. ఆందోళనకరం
చెరుకూరి సుభాష్చంద్రబోస్, తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ఏలూరు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన ఏడు వాయిదాల కరువు భత్యం 30 శాతం ఇప్పటి వరకు మంజూరు చేయకపోవడంపై ఆందోళన కలిగించే అంశం. మూడేళ్లు గడుస్తున్నా డీఏ బకాయిలపై ప్రభుత్వం మాట్లాడకపోవడం శోచనీయం.
పెన్షనర్లకూ పెండింగ్
కేపీ వెంకన్న, పెన్షనర్ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు
2018 జూలై నుంచి పెన్షనర్లకు రావాల్సిన డియర్నెస్ రిలీఫ్(డీఆర్)లు పెండింగ్లో ఉన్నాయి. 30 నెలల నుంచి ఉద్యోగులకు డీఏ ఏరియర్స్ మంజూరు లేదు. ప్రభుత్వం జీవో ద్వారా మూడు డీఏలను, 30 నెలల కరువు భత్యాన్ని మూడు వాయిదాలలో చెల్లిస్తామంటూ ఉత్తుర్వులు ఇచ్చినప్పటికీ ఒక వాయిదా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. జీవో ఆధారంగా ట్రెజరీ శాఖ ఆదాయ పన్ను ముందే మినహాయించింది. పెన్షన్ మీద ఆధారపడి జీవించే వయో వృద్ధులకు కరువు భత్యం ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేయాలి.
వెంటనే మంజూరు చేయాలి
నల్లా అప్పారావు, ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు, ఏలూరు
వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు కరోనా సమయంలో ఎంతో మానసిక, శారీరక ఒత్తిడితో వైద్య సేవలందించారు. 2018లో ధరలకు నేటి ధరలు 30 శాతం పెరుగుదల సూచిస్తున్నాయి. నిత్యావసర వస్తువులైన ఆయిల్స్, పప్పు దినుసులు, అపరాల రేట్లు బాగా పెరిగాయి. కరువు సూచీ సుమారు ఐదు రెట్లు పెరిగింది. కానీ, మా జీతాలు పెరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. న్యాయపరంగా రావాల్సిన కరువు భత్యాలను వెంటనే మంజూరుచేయాలి
ఏడు వాయిదాల డీఏ బకాయిలు
1.7.2018 3.144%
1.1.2018 3.144%
1.7.2019 5.240%
1.1.2020 14% (1.7.2020–1.1.2021 మూడు వాయిదాలు కలిపి)
1.7.2021 5%
మొత్తం బకాయి 30.528%
2014 డీఎస్సీలో ఉద్యోగం పొంది 2016లో ఉపాధ్యాయుడిగా నియమించబడిన ఓ టీచర్ తనకు రావల్సిన డీఏ బకాయిలు గురించి తెలిపిన వివరాలు
01.07.2018 – 31.12.2020 (30 నెలలు) రూ. 21,708
01.01.2019 – 31.07.2021 (30 నెలలు) 34,111
01.07.2019 – 31.07.2021 (25 నెలలు) 46,206
01.01.2020 – 31.07.2021 (19నెలలు) 21,187
01.07.2020 – 31.07.2021 (13నెలలు) 19,494
01.01.2021 – 31.07.2021 (7 నెలలు) 10,538
మొత్తం 124 నెలలకు రూ. 1,53,244లు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
0 Response to "Allowance .. Drought!"
Post a Comment