Corona cases on the rise in schools
భయం వెం..బడి
- పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు
- 15 రోజుల్లో 29 మంది విద్యార్థులు, 15 మంది టీచర్లకు..
- స్కూళ్లలో అమలుకాని కొవిడ్ నిబంధనలు
- పది మినహా మిగిలిన తరగతుల హాజరు అంతంతే..!
బడికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలోని ముదినేపల్లి, ముసునూరు తదితర పాఠశాలల్లో 29 మంది విద్యార్థులు, 15 మంది టీచర్లు కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో 4,444 పాఠశాలలుండగా, 6.23 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలకు వచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని టీచర్లు అంటున్నారు. ఇప్పటికే చాలామంది టీచర్లు, వారి కుటుంబసభ్యులు కరోనా బారిన పడగా, గుట్టుచప్పుడు కాకుండా వైద్యసేవలు పొందుతున్నారు. ప్రస్తుతం పదో తరగలో 70 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు వస్తుండగా, మిగిలిన దిగువ తరగతుల్లో 30 నుంచి 50శాతంలోపే హాజరుశాతం ఉంటోంది.
కనీస జాగ్రత్తలేవీ..?
పాఠశాలలు తెరిచే సమయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేయాలని సూచించింది. విద్యార్థులు పాఠశాలకు వచ్చే సమయంలో తప్పనిసరిగా థర్మల్ స్కానింగ్ చేసి ఉష్ణోగ్రత పరిశీలించాలని తెలిపింది. కానీ, వందలాది పాఠశాలల్లో థర్మల్ స్కానర్లు పనిచేయని పరిస్థితి. కొన్నింటికి బ్యాటరీ సామర్థ్యం చాలక పరీక్షలు చేసే అవకాశంలేని స్థితి. ఒక తరగతి గదిలో 20 మంది విద్యార్థులనే కూర్చోబెట్టాలని, టాయిలెట్ల వద్ద సబ్బు, నీరు అందుబాటులో ఉంచాలని, మధ్యాహ్న భోజనం సమయంలో విద్యార్థులు ఒకచోట గుమిగూడకుండా చూడాలని ప్రభుత్వం నిర్దేశించినా ఎక్కడా అమలు కావట్లేదు.
పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సులు అమలయ్యేనా?
ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి పాఠశాలలు తెరిచే అంశంపై పార్లమెంటరీ స్థాయీసంఘం ఒక నివేదికను సమర్పించింది. పాఠశాలలు తెరవకుంటే విద్యార్థులపై ఆ ప్రభావం పడి మానసికంగా వారు బలహీనులవుతారని, ప్రవర్తనలో మార్పులొస్తాయని పేర్కొంది. పాఠశాలలు తెరిచి ఆయా తరగతులవారీగా, షిఫ్టులవారీగా పాఠాలు బోధించాలని తెలిపింది. రోజు విడిచి రోజు తరగతుల్లో పాఠాలు బోధించాలని పేర్కొంది. ఈ సిఫార్సులను కూడా జిల్లాలో అమలు చేయట్లేదు.
పనిచేయని యాప్లతో తంటాలు
పాఠశాలకు సంబంధించిన సమాచారం పంపే పనికే అధిక సమయం కేటాయించాల్సి వస్తోందని టీచర్లు చెబుతున్నారు. టీచర్ల బయోమెట్రిక్, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథక వివరాలు.. ఇతర అంశాలపై ప్రభుత్వానికి సమాచారం పంపేందుకే సమయం సరిపోతోందని టీచర్లు అంటున్నారు. ఈ వివరాలు పంపేందుకు ఉపయోగించే సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఇటీవల ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సర్వర్ సామర్థ్యం పెంచుతామని చెప్పిన మరుసటి రోజే.. సర్వర్ పనిచేయడం మరింత తగ్గింది.
0 Response to "Corona cases on the rise in schools"
Post a Comment