Three lakh loan!.. More than half of the interest will be paid by the center.. Full details
మూడు లక్షల లోన్!.. సగానికి పైగా వడ్డీ కేంద్రమే కడుతుంది. పూర్తి వివరాలు
దేశంలో పేదరికాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అన్ని వర్గాలను అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
పేద వారిని, వివిధ రకాల వృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు పథకాల ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గతేడాది పీఎం విశ్వకర్మ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు, తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తోంది. మరి ఈ లోన్ పొందడానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సెంట్రల్ గవర్నమెంట్ పీఎం విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారికి లోన్స్ అందిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 18 రకాల చేతి వృత్తి వర్గాలకు లబ్ధి చేకూరనున్నది. చేతివృత్తుల వారికి ట్రైనింగ్ ఇప్పించి ఆ తర్వాత రుణ సాయం కూడా అందిస్తుంది. ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ సర్టిఫికెట్ తో పాటు ఐడీ కార్డు కూడా అందిస్తుంది. ట్రైనింగ్ సమయంలో రోజుకు రూ. 500 స్టైఫండ్ ఇస్తుంది. మొదట టూల్ కిట్స్ కోసం రూ. 15 వేల ఆర్థిక సాయం, ఆ తర్వాత 5 శాతం వడ్డీకే మూడు లక్షల లోన్ అందిస్తుంది.
మామూలుగా బ్యాంకులు 13 శాతం వార్షిక వడ్డీతో లోన్స్ ఇస్తాయి. కానీ ఈ విశ్వకర్మ పథకం ద్వారా లోన్ తీసుకున్నట్లైతే.. సగానికి పైగా అంటే 8 శాతం వడ్డీని కేంద్రమే చెల్లిస్తుంది. పీఎం విశ్వకర్మ పథకంలో ముందుగా రూ. లక్ష లోన్ పొందొచ్చు. ఈ లోన్ ను ఏడాదిన్నరలోగా(18నెలలు) చెల్లించాలి. ఆ తర్వాత మరో రెండు లక్షల లోన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ లోన్ ను రెండున్నరేళ్లలో (30నెలలు) చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి కేంద్రం అందిస్తున్న గొప్ప పథకం ఇది.
స్వర్ణకారులు, విగ్రహాల తయారీదారులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పనిచేసేవారు, సంప్రదాయ బొమ్మలు చేసేవారు, క్షురకులు, పూలదండలు చేసేవారు, దర్జీలు, వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, ఇనుప పరికరాలు చేసే వారు, కమ్మరి, ఇంటి తాళాల తయారీదారులు, కుమ్మరి, రజకులు, చేప వలల తయారీదారులు వంటివారు పీఎం విశ్వకర్మ పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే.. ఆయా చేతి వృత్తి పనులు చేస్తున్న వారు అర్హులు. 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, గత ఐదేళ్లలో ఇలాంటి పథకాల ద్వారా లోన్ పొందిన వారు అనర్హులు.
దరఖాస్తు చేసుకోదలిచిన వారు పీఎం విశ్వకర్మ పథకం అధికారిక వెబ్ సైట్ https://pmvishwakarma.gov.in/ లోకి వెళ్లాలి. మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. తర్వాత ఆధార్ కార్డు నంబర్ ఇవ్వాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. ఆ ఫారంలో అవసరమైన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. సంబంధిత అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేశాక అర్హులైన వారిని ట్రైనింగ్ కు ఎంపిక చేసి ఆన్ లైన్ లోనే శిక్షణ ఇస్తారు. అర్హులైన చేతి వృత్తుల వారు అవసరమైన సర్టిఫికెట్లను తీసుకెళ్లి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రయోజనాలను అందుకోండి.
0 Response to "Three lakh loan!.. More than half of the interest will be paid by the center.. Full details"
Post a Comment